
జ్ఞానవంతుడే జ్ఞానిని గుర్తించగలడు.
వాదన అజ్ఞానాన్ని,చర్చ జ్ఞానాన్ని పెంచుతుంది.
జ్ఞానం ఎంత ఉన్నా అది ఆచరణలేకపోతే వ్యర్ధం అగును.
నేర్చుకొనే వారికి గౌరవం ఇవ్వడంలోనే విద్యావంతుల గొప్పతనం ఉంటుంది.
దేవుని భజించి జీవుని బాధించిన మోక్షము లభించదు.
భగవంతుడు అందరిలా నీవిత్తాన్ని చూడడు,నీ చిత్తాన్ని చూస్తాడు.
మూర్ఖుని ప్రశంసలకన్నా మహాత్ముల సూచనలు ఉన్నతమైనవి.
గురుద్రోహిని గుడిలోని దేవుడు కూడ రక్షించలేడు.
శాన్తి లేని మతి,పతి గుణమెరుగని సతి,రాతి గుండె గల యతి,శృతిలేని గానం నిష్ఫలం.
కామంతో,ధనంతో,బంధుత్వం ఎంతదూరమైతే భగవంతునితో బంధుత్వం అంతదగ్గరవుతుంది.
అడగకుండానే చెప్పడం అవివేకం,అడిగితే తెలిసీ చెప్పకపోవడం అహంకారం.
నువ్వు మాత్రమే తింటే దాణా,అది ఇతరులకు కూడా ఇస్తే దానం.
పుస్తకాలను చెదపురుగు నాశనం చేస్తే,మనలోని అహంకారం మనల్ని నాశనం చేస్తుంది.
గురువు అనుగ్రహసంచారం ఉన్నచోట గ్రహసంచార ఫలములు పనికిరావు.
పర్వతాలను ఎక్కేటప్పుడు వంగినడిచినట్లే లక్ష్యసాధనలో అణుకువతో నడవాలి.
ఒకడు ఏడుస్తుంటే పదిమంది నవ్వుతూ ఆహ్వానించడం జననం,పదిమంది ఏడుస్తూ ఒకడిని పంపిచడం మరణం.
జ్ఞాని పొందే ఆనందం భోగికి తెలియదు.
భోగి ఏది ఆనందమనుకుంటున్నాడో అది మారువేషంలో ఉన్న దుఃఖమని జ్ఞానికి తెలుసు.
దుఃఖం కోసం ప్రయత్నం చేయనట్లే,సుఖం కోసం కూడా ప్రయత్నం చేయనివారే నిజమైన జ్ఞాని.
నిందలను వందనములుగా,నిందించువారిని పరోక్ష గురువులుగా భావించువారే జ్ఞానులు.
గుణాలతో సన్యాసి కావలెను కాని గుడ్డలతో కాదు.
భయం లేకుండా నేర్చుకుని ,గర్వం లేకుండా పదిమందికి తెలియపరుచువాడే జ్ఞాని.
ఇట్లు
మీ సుబ్రహ్మణ్య సిద్ధాన్తి

No comments:
Post a Comment